తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుబాటులో వుందని...ఈ విషయంలో దేశంలోని మన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 

జహిరాబాద్: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ కృషిచేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఇంతటితో ఆగకుండా తొలి స్థానంలో నిలిపేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని మంత్రి సూచించారు. 

సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రముఖ వ్యాపారసంస్థ మహింద్రా ఆండ్ మహింద్రా సంస్థ 500lpm ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటుచేసింది. ఈ ప్లాంట్ ను ఇవాళ(ఆదివారం) మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఆండ్ మహింద్రా ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని తెలిపారు. 

''కరోనా సెకండ్ వేవ్ సమయంలో 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఆ సమయంలో మనకు అందుబాటులో ఉండింది‌. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డాం. ఈ పరిస్థితి గమనించి ‌సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు'' అని మంత్రి హరీష్ పేర్కొన్నారు. 

''ప్రస్తుతం‌ తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి 300 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి హైదరాబాద్ శివారలోని పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం. త్వరలో ఇది ప్రారంభమవుతుంది'' అని తెలిపారు. 

''రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదు.‌ వైద్య రంగంలో‌ గుణాత్మక మార్పులు తెచ్చాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు‌ చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోంది. రెండం, మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గింది. అయినా అలసత్వం వద్దు. అందరం మాస్క్ ధరిద్దాం, వాక్సిన్ వేయించుకుందాం'' అని మంత్రి సూచించారు.

ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని ‌‌సందర్శించారు. అన్ని వార్డుల్లో కలియతిరిగి డాక్టర్లు, ఇతర సిబ్బందితో పాటు రోగులను ఆడిగి హాస్పిటల్ లో సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని జహిరాబాద్ ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు ‌చేస్తామని మంత్రి ప్రకటించారు. 

కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో‌ డెలివరీలు పెరిగాయని... ప్రస్తుతం‌ 52శాతమున్న డెలివరీలు‌ 75 శాతానికి పెంచాలని మంత్రి ఆదేశించారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్‌ డెలివరీలు బాగా జరుగుతున్నాయంటూ ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు మంత్రి హరీష్. 

అనవసరంగా సెక్షన్ సర్జరీలు చేయవద్దని... దీని వల్ల‌ తొలి‌గంటలో శిశువుకు ‌అందాల్సిన అమృతమైన తల్లిపాలు అందడం లేదన్నారు. దీని వల్ల‌ శిశువులో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. దాదాపు మన రాష్ట్రంలో‌ఇలా‌ 66 శాతం మంది‌ శిశువలకు తొలి‌గంటలో పాలు అందడం‌ లేదన్నారు. ఈ అనవసర సర్జరీల వల్ల‌ 35 ఏళ్లకే తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. 

ఆరోగ్యశ్రీ,, ఆయుష్మాన్ భారత్‌ కింద ఏరియా ఆస్పత్రిలో‌ చికిత్సలు చేయాలని మంత్రి ఆదేశించారు. డిపార్ట్ మెంట్ ల వారీగా సిబ్బంది పనితీరును అడిగి‌ తెలుసుకున్నారు. మందుల‌ కొరత, నిధుల‌ కొరత ప్రభుత్వం రానివ్వదని... చక్కటి‌ వైద్యం పేదలకు అందించాలని సిబ్బందికి‌ మంత్రి ‌సూచించారు. రోగులను ప్రేమగా పలకరించాలని... మర్యాదగా వ్యవహరించాలన్నారు. వృత్తిని, ఉద్యోగధర్మాన్ని మరువవద్దని మంత్రి హరీష్ జహిరాబాద్ హాస్పిటల్ సిబ్బందికి సూచించారు.