ఈటల... ఆ టీఆర్ఎస్ నేతలు అమ్ముడుపోతున్నారా..?: మంత్రి గంగుల (వీడియో)
ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలే ఫిర్యాదులు చేయడం జరిగింది... అందువల్లే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ గుర్తుచేశారు.
కరీంనగర్: హుజురాబాద్ నాయకులను, ప్రజా ప్రతినిధులను డబ్బులిచ్చి కొంటున్నారు అంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనడం బాధాకరమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అమ్ముడుపోయారని ఈటల అనడం తనను బాధ కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున గెలిచిన ఎవ్వరు అమ్ముడు పోరని గంగుల అన్నారు.
''గత 15 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలే ఫిర్యాదులు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెంటనే విచారణకు ఆదేశించడం... ఈటలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం జరిగింది'' అని గంగుల గుర్తుచేశారు.
వీడియో
''కరీంనగర్ లో గంగులకు ప్రత్యేకంగా వర్గం ఉండదు... అందరూ టిఆర్ఎస్ వర్గం వారే. ఈటల కాంగ్రెస్, బిజెపి వాళ్ళ గడప తొక్కడంతో అక్కడి టిఆర్ఎస్ నేతలు అయోమయంలో పడ్డారు. తర్వాత వారంతా ఈటలను వదిలి టిఆర్ఎస్ లోనే ఉంటామని... కేసీఆర్ తోనే మా ప్రయాణం అని క్లియర్ చెప్పడం జరిగింది'' అన్నారు.
''హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమాలపూర్ లలో ఉన్న టిఆర్ఎస్ జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్ లు అంతా టిఆర్ఎస్ వైపే ఉంటామని జై కొట్టారు.కేసీఆర్ బొమ్మ చూసి ఓట్లు పడ్డాయి కావున తాము కేసీఆర్ వెంటే ఉంటామని వస్తున్నారు'' అని గంగుల వెల్లడించారు.