ఆ చిన్నారిని చూసి భావోద్వేగానికి గురైన ఈటల
జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎందరి కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదంలో చనిపోయిన వారిని తలచుకుని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణణాతీతం. మరణించిన వారిని తలచుకుంటూ ఏడుస్తున్న తీరు అందరి హృదయాలను కలచివేస్తోంది.
కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎందరి కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదంలో చనిపోయిన వారిని తలచుకుని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణణాతీతం. మరణించిన వారిని తలచుకుంటూ ఏడుస్తున్న తీరు అందరి హృదయాలను కలచివేస్తోంది. బస్సు ప్రమాదంలో తల్లిని కోల్పోయిన ఓ చిన్నారి ఆస్పత్రిలో అమ్మ కావాలి అంటూ రోదిస్తున్న తీరు సాక్షాత్ మంత్రి ఈటల రాజేందర్ కంట కన్నీరు పెట్టించింది.
కొండగట్టు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కరీంనగర్ జిల్లా నంగునూర్ ప్రతిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి ఈటెల రాజేందర్ పలువురు మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో తల్లిని కోల్పోయిన ఓ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమ్మ కావాలి అంటూ ఏడుస్తుండటం చూసి మంత్రి ఈటల రాజేందర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఓదార్చారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. తక్కువ మొత్తంలో ఆర్థిక సాయం అందుతున్న క్షతగాత్రులు, బాధితులకు తెలంగాణరాష్ట్ర సమితి ద్వారా మరింత ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని ప్రకటించారు.
ప్రమాదంలో 62 మంది చనిపోయారని, 32 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి ఈటల తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు.