నీటమునిగిన వరంగల్... లోతట్టు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి బోటు ప్రయాణం(వీడియో)
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నగరంలో వరద ముంపుకు గురయిన ప్రాంతాలను గురువారం పర్యటించారు.
వరంగల్: వరద ముంపు బాధితులను పరామర్శిస్తూ, వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, పునరారవాస కార్యక్రమాలను పురమాయిస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసానిస్తూ... నేనున్నానే ధైర్యం చెబుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నగర వరద ముంపు ప్రాంతాలను గురువారం పర్యటించారు. మైసయ్య నగర్, రామన్నపేటలోని రెండు కాలనీలు, సంతోషిమాత గుడి, భద్రకాళి గుడి, ములుగు రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, కార్పొరేటర్లు, కలెక్టర్, కమిషనర్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు.
సంతోషిమాత గుడి సమీపంలోని కాలనీల్లో నీరు పెద్దమొత్తంలో నిలువ ఉండటంతో అక్కడ సహాయక చర్యలు నిర్వర్తిస్తున్న డిఆర్ఎఫ్ సభ్యులతో కలిసి మంత్రి బోట్ లో ప్రయాణించారు. నీటిలో చిక్కుకున్న వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలి నొప్పిని సైతం లెక్క చేయకుండా మెకాలలోతు నీటిలో ఆయా కాలనీలను కలియ తిరిగారు. బాధితలను పరామర్శించారు.
వీడియో
"
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి బాధితులతో మాట్లాడుతూ... వరద ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే పునరావాస కేంద్రాలు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సహాయక కార్యక్రమాలను వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు, నగర కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అందరికీ సహాయక చర్యలు అందుతాయన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, వెంటనే కంట్రోల్ రూమ్ లలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్లు చేయాలని సూచించారు. అలాగే అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి, తక్షణమే పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి, వారికి తగిన ఆహారం సదుపాయాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కొందరికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు.
ఇక వరద ముంపు లేకుండా శాశ్వత నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి దయాకర్ రావు చెప్పారు. ఈ నెల 18న ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్ నగరమంతా పర్యటించారన్నారు. ఆ సందర్భంగా జరిగిన సమీక్షలో ప్రజాభీష్టం మేరకు నాలాలపై కబ్జాలను తొలగింపు ప్రారంభమైందన్నారు. ప్రజలు వరదల నుంచి శాశ్వత ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వ చర్యలు మొదలయ్యాయని ఈ సారికి ప్రజలు కాస్త ఓపిక పట్టాలన్నారు. అలాగే ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వరంగల్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వరద సహాయం కింద తక్షణమే రూ.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి కెటిఆర్ ఈ సహాయాన్ని ప్రకటించారన్నారు. ఈ మేరకు ఆ నిధులతో తక్షణ సహాయక చర్యల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు వరద ముంపు ప్రజలను ఆదుకోవాలని ఆదేశించారు. వరద నష్టాల అంచనా తర్వాత మిగతా అవసరమైన నిధులను కెసిఆర్ ప్రకటిస్తామని మంత్రి ప్రజలు తెలిపారు.
కాగా వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపిందని... ఆ మేరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్లు ప్రాంతాలను ఖాళీ చేయాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్ళను ఖాళీ చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.