మొక్కలు కాపాడకుంటే సంక్షేమ పథకాలు కట్: మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు.
హుజురాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను తెలుసుకున్న అక్కడికక్కడే వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేశారు. ఇలా పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.2 కోట్ల మంజూరుకు హామీ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి.
''నూతనంగా చేపట్టబోయే పాఠశాలల అభివృద్ధిలో భాగంగా మండలానికి ఐదు పాఠశాలలు ఎంపిక చేస్తున్నాం. అందులో పెద్దపాపయ్య పల్లికి చోటు కల్పిస్తాం'' అని మంత్రి హామీ ఇచ్చారు.
పల్లె ప్రగతి సమావేశానికి హాజరుకాని మండల విద్యాధికారికి మెమో జారీ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అలాగే మొక్కలను కాపాడకపోతే సంక్షేమ పథకాలు ఆపాలని అధికారులకు సూచించారు.
read more ఉపఎన్నిక ఎఫెక్ట్... హుజురాబాద్ పై మంత్రి ఎర్రబెల్లి వరాల జల్లు
ఈ సంవత్సరం మొదటి విడతగా పాఠశాలలకు, వైద్యానికి రూ.8 వేల కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. పేద వారికి ఉచిత విద్య వైద్యం అందించడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. బడ్జెట్ లో లేకపోయినా రూ.12 వేల కోట్లు అప్పు చేసి రైతు బంధు ఇచ్చిన నాయకుడు కెసిఆర్ అని అన్నారు. రైతుల కోసం ఎలక్ట్రిసిటీ కి రూ.12 వేల కోట్లు కడుతుంది కెసిఆర్ అంటూ ఎర్రబెల్లి కొనియాడారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎలాంటి అంట వ్యాధులు రాకుండా జాగ్రత్తపడుతున్నామన్నారు. పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశారు మంత్రి ఎర్రబెల్లి.