ఆ నియోజకవర్గంలో వార్ వన్సైడే.. ఆమె గెలిచితీరుతుంది.. మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ములుగు నియోజకవర్గం గురించి మాట్లాడారు. ములుగులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ సీటు కచ్చితంగా బీఆర్ఎస్కే దక్కుతుందని అన్నారు. బడే నాగజ్యోతి గెలుపు తథ్యం అని, కాంగ్రెస్ బోగస్ పార్టీ అని విమర్శించారు.
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యేగా ప్రస్తుతం సీతక్క ఉన్న సంగతి తెలిసిందే. ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ములుగులోని లీలా గార్డెన్స్లో సోమవారం బీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దయాకర్ రావు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రాష్ట్రబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ములుగు నియోజకవర్గం గురించి, ఇక్కడ కీలక నేతల గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. నాగజ్యోతి కుటుంబానికి పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన ఘన చరిత్ర ఉన్నదని అన్నారు. ఇది గుర్తించే సీఎం కేసీఆర్ ఆమెకు టికెట్ ఇచ్చారని తెలిపారు. ఇక్కడ నిర్వహించిన సర్వేలన్నీ ఆమెకు అనుకూలంగా వచ్చాయని, బడే నాగజ్యోతి గెలుపునకు తిరుగు లేదని, ఆమె కచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పారు.
Also Read: TS News: ఉపాధ్యాయురాలి కంట్లో కారం కొట్టి మంగళసూత్రం చోరీ చేసిన దొంగ
ములుగు నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ టికెట్ను చాలా మంది ఆశించారని, కానీ, కేసీఆర్ నాగజ్యోతికి మొగ్గు చూపారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అయితే.. మిగిలిన నేతలను పట్టించుకోమని కాదని, వారందరికీ పార్టీ కచ్చితంగా న్యాయం చేస్తుందని తెలిపారు. అజ్మీరా చందూలాల్ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంతో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని, ఇది కేసీఆర్ చొరవతోనే జరిగిందని వివరించారు. ఆయనకు వైద్యం అందించడానికి అమెరికా నుంచి వైద్య నిపుణులు కేసీఆర్ రప్పించారని తెలిపారు. చందూలాల్ కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అభిమానం ఉన్నదని, పార్టీకి వారు ద్రోహం చేయవద్దని కోరారు. ఏం కావాలో పార్టీని అడగాలని, పార్టీ తప్పకుండా అందరికీ న్యాయం చేస్తుందని వివరించారు.
పోడు భూములకు పట్టా ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భోగస్ అని, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బోగసే అని ఆరోపించారు.