ఓ వార్డు బాయ్ కేవలం వందరూపాయల కోసం ఓ చిన్నారి ప్రాణాలు తీసిన దారుణం హైదరాాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: కేవలం వంద రూపాయలకు కక్కుర్తిపడి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడో వార్డుబాయ్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సపొందుతున్న బాలుడికి అమర్చిన ఆక్సిజన్ పైప్ ను డబ్బులు తీసుకుని వేరేవారికి అమర్చడంతో బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ అమానుషం హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే...hyderabad ఎర్రగడ్డ ప్రాంతంలో నివాసముండే మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే సదరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుండటంతో భరించలేక నీలోఫర్ లో చేర్చారు. 

గత మూడురోజులుగా ఖాజాను Niloufer Hospital వైద్యులు వెంటిలేటర్ పై వుంచి వైద్యం అందిస్తున్నారు. అయితే శనివారం విధుల్లో వున్న వార్డు బాయ్ సుభాష్ కేవలం వంద రూపాయలు తీసుకుని ఖాజాకు అమర్చిన ఆక్సిజన్ పైపును తీసి పక్కనే వున్న బెడ్ లోని బాలుడికి అమర్చాడు. దీంతో కొద్దిసేపటికే ఖాజా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

read more ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి.. సర్పంచి భర్త లైంగిక దాడి..

ఖాజా తల్లిదండ్రులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికే బాలుడు మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు వైద్య సిబ్బంది తీరుపై ఆందోళనకు దిగారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి కూడా అక్కడికి చేరుకుని వైద్యులు,వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

బాలుడి మృతికి కారణమైన వార్డు బాయ్ సుబాష్ ను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఇలా డబ్బులకు కక్కుర్తి పడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వార్డు బాయ్ లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని బాధిత కుటుంబం అంటోంది. అతడిపై పోలీస్ కేసు నమోదు చేసి శిక్షించాలని కోరుతున్నారు.