స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి...టీఆర్ఎస్పై గెలిచిన ఎంసీఏ విద్యార్ధిని
యువత రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో నేతలు ప్రసంగాల్లో దంచి కొడుతుంటారు. అయితే ఆ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి వచ్చే వారు ఎంతమంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అయితే దీనిని ఆచరణలో పాటించారు అనూష అనే యువతి.
యువత రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో నేతలు ప్రసంగాల్లో దంచి కొడుతుంటారు. అయితే ఆ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి వచ్చే వారు ఎంతమంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు.
అయితే దీనిని ఆచరణలో పాటించారు అనూష అనే యువతి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కుమార్తె అనూష..
ఈమె కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీచైతన్య కళాశాలలో ఎంసీఏ మూడవ సంవత్సరం చదువుతోంది. తండ్రి బాటలో రాజకీయాల్లో రాణించాలని భావించిన ఆమె.. నాలుగు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది.
అయితే తాజా ఎంపీటీసీ ఎన్నికల్లో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి స్థానానికి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి పడాల శ్రీజపై అనూష 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కేవలం 23 సంవత్సరాల వయసులోనే ఎంపీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందడం పట్ల కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కళాశాల విద్యార్ధిని ఎన్నికల్లో గెలుపొందడం పట్ల శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు.