Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 5 వేలకు పెంచుతామన్న మంత్రి హరీశ్ రావు

Hyderabad: తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లను 5000కు పెంచుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. వివిధ కళాశాలల్లో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 240 సీట్లు అదనంగా పెరిగాయని వెల్లడించారు. ప్రతి తెలంగాణ కుటుంబం గౌరవప్రదమైన ఇంటిలో నివసించేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షిస్తున్నారని మంత్రి అన్నారు.  

MBBS seats in government colleges will be increased to 5,000, says Telangana Minister Harish Rao
Author
First Published Sep 22, 2022, 2:30 PM IST

Health minister T Harish Rao: ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను త్వరలో 5 వేలకు పెంచుతామని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు తమ ఎంబీబీఎస్‌ విద్య కోసం ఉక్రెయిన్‌, రష్యాలకు విదేశాలకు వెళ్లాలనే విధంగా ఒత్తిడి వాతావరణం తీసుకురాబోమని ఆయన తెలిపారు. వివిధ కళాశాలల్లో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 240 సీట్లు అదనంగా పెరిగాయని చెప్పారు. సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులతో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 840 నుంచి 2,840కి పెంచామన్నారు. మొత్తం 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రణాళిక సిద్ధం చేశారనీ, త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య 5వేలు దాటనుందని ఆయన అన్నారు.

“ఉక్రెయిన్, రష్యన్ విశ్వవిద్యాలయాలలో ఎంబీబీఎస్ చదువుతున్న భారతదేశానికి చెందిన వేలాది మంది విద్యార్థులు యుద్ధం కారణంగా తమ చదువును మధ్యలోనే ఆపుకోవలసి వచ్చింది. అయితే, ఇంటికి తిరిగి వచ్చిన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదు” అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో తమ చదువును కొనసాగించేందుకు సహాయం చేస్తుందనీ, అయితే జాతీయ వైద్య మండలి తమ ప్రతిపాదనను ఆమోదించలేదని మంత్రి తెలిపారు. తెలంగాణలో తగినన్ని సీట్లను సృష్టించబోతున్నందున భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. వివిధ కళాశాలల్లో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 240 సీట్లు అదనంగా పెరిగాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. సూపర్ స్పెషాలిటీలోనూ అదనపు సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవని చెప్పిన  మంత్రి.. తెలంగాణ రాష్ట్రం ఈ ఘనత సాధించడంలో ముందుంటుందని అన్నారు. దీంతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఇక్కడి విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశాలు కల్పించాలనే లక్ష్యాలను సాధిస్తామని హరీశ్ రావు తెలిపారు.

అంతకుముందు, గజ్వేల్‌ నియోజకవర్గం కొండపాక మండలంలోని నాలుగు గ్రామాలలో 218 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంగళవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులకు అందజేశారు. సుడిగాలి పర్యటన సందర్భంగా కొండపాక మండల కేంద్రంలో 93 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. అలాగే, ఖమ్మంపల్లి గ్రామంలో 60 డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. అదే మండలంలోని దుద్దెడలో 40, జప్తి నాచారం గ్రామాల్లో 25 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఆయన అందజేశారు. ప్రారంభోత్సవానికి ముందు నాలుగు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటిని సందర్శించి లబ్ధిదారులను అభినందించి మిఠాయిలు పంచుకున్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలాలు అందుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కొండపాక ప్రజలు మద్దతు తెలిపిన తీరును గుర్తుచేసుకున్నారు. మండలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి తెలంగాణ కుటుంబం గౌరవప్రదమైన ఇంటిలో నివసించేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షిస్తున్నారని మంత్రి అన్నారు.

వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రివర్స్ మైగ్రేషన్‌కు తెరలేపిందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలు పచ్చని పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ ముంబై, బొగ్గు గనులు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం మానేశారని చెప్పారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేందుకు వలస వస్తున్నారని తెలిపారు. కొండపాక మండలానికి చెందిన 1067 మంది లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని, దేశంలోని ఏ బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios