భవనంపై నుండి దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం, కట్నం వేధింపులే కారణమా?
అత్తింటివారి వేధింపులే కారణమంటున్న బాధితురాలి తల్లి
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను నివాసముండే ఇంటిపై నుండి దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే స్థానికులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బైటపడింది. కానీ వెన్నుముకతో పాటు కాలు విరగి పోయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్ లోని తేజస్వి నగర్ లో నివాసముండే నీలం అగర్వాల్ కి శశి అగర్వాల్ తో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఈమె నివాసముంటున్న భవనం రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడటం ఆ కుటుంబంలోనే కాదు కాలనీలోను విషాదాన్ని నింపింది.
అయితే తన కూతురు ఆత్మహత్యాయత్నానికి అదనపు కట్నం వేధింపులే కారణమని బాదితురాలి తల్లి శశికళ ఆరోపించారు. పెళ్లి సమయంలో ఇచ్చిన 12 లక్షల కట్నం సరిపోలేవని భర్త, అత్త తన కూతురిని వేధించేవారని ఆమె తెలిపింది. దీనికి కారణమైన భర్త నీలం, అత్త విజయలక్ష్మిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.