శంషాబాద్ విమానాశ్రయం నుండి మహిళ మిస్సింగ్
జైపూర్ లో ప్లైట్ ఎక్కి... శంషాబాద్ లో మాయం
జైపూర్ ఎయిర్ పోర్టు లో హైదరాబాద్ ప్లైట్ ఎక్కిన ఓ యువతి శంషాబాద్ ఎయిర్ పోర్టులో మిస్సయిన ఘటన సంచలనం సృష్టించింది. యార్లగడ్డ సాయి ప్రసన్న(28) అనే యువతి శంషాబాద్ విమానాశ్రయంలో మిస్సవడంతో ఆమె తండ్రి ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జైపూర్ ఎయిర్ పోర్టులో యార్లగడ్డ సాయిప్రసన్నను ఆమె భర్త హైదరాబాద్ విమానం ఎక్కించారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె కోసం తండ్రి, తమ్ముడు ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది...కానీ తండ్రి,
తమ్ముడికి కలవకుండా మిస్సయింది.
వారికి తెలియకుండానే సాయిప్రసన్న విమానాశ్రయం నుండి ఒంటరిగా క్యాబ్ మాట్లాడుకుని ఎక్కడికో బయలుదేరింది. క్యాబ్ ఎక్కిన తర్వాత తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడింది. దీంతో తమ్ముడు వెంటనే క్యాబ్ దిగాల్సిందిగా ఆమెకు చెప్పాడు. అతడి ఫోన్ ను మద్యలోనే కట్ చేసిన ప్రసన్న ఫోన్ స్విఛ్చాప్ చేసుకుంది. దీంతో ఆమె తండ్రి, తమ్ముడు ఆందోళన చెందారు. సాయిప్రసన్న తండ్రి ఆ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేశాడు.
అల్లుడి సలహా మేరకు ప్రసన్న తండ్రి తన కూతురు సాయిప్రసన్న మిస్సైందని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఎయిర్పోర్ట్లోని సీసీ టీవీ ఫుటేజీలే కీలకమని పోలీసులు భావిస్తున్నారు.
అయితే తన భార్య మిస్సింగ్ వెనుక ఖమ్మంకి చెందిన మోహన్ రావు హస్తం ఉందని సాయిప్రసన్న భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టిసారించి దర్యాప్తు చేస్తున్నారు.