మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మర్రి శశిధర్ రెడ్డి.. బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఇష్టం లేకపోయినా సరే కాంగ్రెస్‌ పార్టీని వీడి బయటకు వస్తున్నానని తెలిపారు. ఇందుకు సంబంధించి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ప్రారంభానికి ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేది ఏం లేదని రేవంత్ రెడ్డి టార్గెట్‌గా వ్యంగ్యస్త్రాలు సంధించారు. తనలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడతారని అన్నారు. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని తాను కూడా చెప్పానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను కూడా రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. ఎవరూ పార్టీలో నుంచి బయటకు వెళ్లినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. 


ఇక, మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. శశిధర్ రెడ్డి త్వరలో కాషాయ పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లిలో అమిత్ షాను కలిసినట్టుగా సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరగగా.. తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి మర్రి శశిధర్ రెడ్డితో అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపడాన్ని అమిత్ షా స్వాగతించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తన మద్దతుదారులను సంప్రదించిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.