తెలంగాణకు గుర్తింపు తెచ్చింది మర్రి చెన్నారెడ్డి... ఆయన అడుగుజాడల్లోనే ముందుకు : శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ మాజీ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మర్రి చెన్నారెడ్డేనని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు.
తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మర్రి చెన్నారెడ్డేనని అన్నారు ఆయన కుమారుడు శశిథర్ రెడ్డి. శుక్రవారం బీజేపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి ముందుండి నడిపించారని గుర్తుచేశారు. ఆ సమయంలో జైలు పాలు కావడం, పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగాయన్నారు. ఐక్యరాజ్యసమితిలో వున్న కేసు కారణంగా తెలంగాణ ఇవ్వలేమని అప్పటి కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిందని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, వెనుకబాటుతనం పోవాలంటే ఏం చేయాలనే దానిపై చెన్నారెడ్డి పలు సూచనలు చేశారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం సొంత పార్టీని కూడా ఎదిరించారని, పీజేఆర్తో కలిసి తాను పోతిరెడ్డిపాడు విషయంలో పోరాడినట్లు శశిధర్ రెడ్డి గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్ , డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మర్రి శశిధర్ రెడ్డికి కేంద్ర మంత్రి శర్బానంద్ సోనేవాల్ బీజేపీ సభ్యత్వం అందించారు. ఈ సందర్బంగా మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించేవరకు తాను పోరాటం నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.
Also Read:కాంగ్రెస్కి గుడ్బై: బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు నిస్సిగ్గుగా టీఆర్ఎస్ మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు తమ కుటుంబమే దిక్కు అనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉందని చెప్పారు. తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. .టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ తెలంగాణలో తన గోతిని తానే తవ్వుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.