అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ప్రజా కోర్టులో శిక్షిస్తామని హెచ్చరిస్తూ మావోయిస్టుల బహిరంగ లేఖ విడుదల చేసారు.
రామగుండం : ఉద్యోగాల పేరిట అమాయక నిరుద్యోగ యువతను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మోసం చేసారని మావోయిస్టుల బహిరంగ లేఖ పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల కుంభకోణానికి కర్త,కర్మ, క్రియ స్థానిక ఎమ్మెల్యే చందర్ తో పాటు ఆయన అనుచరులేనని అన్నారు. ఇలా మోసాలకు పాల్పడ్డ ఎమ్మెల్యేను వదిలిపెట్టబోమని... ప్రజా కోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
కోల్ బెల్ట్ ప్రాంతంలో కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు రౌడీ షీటర్లను తయారుచేసి ఈ ప్రాంతాన్ని శాసించాలని చూస్తున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. ఇలాంటివారికి త్వరలోనే బుద్ది చెబుతాం... అవసరమైతే ప్రజా కోర్టులో శిక్షిస్తామని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతూ కోల్ బెల్ట్ ప్రాంతంపై దృష్టిసారించలేకపోయామని లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఆర్ఎఫ్ సిఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ ఆండ్ కెమికల్స్ లిమిటెడ్) లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు జరిగిన మోసంపై దృష్టి సారించాం...ప్రజాప్రతినిధులే ఉద్యోగాల పేరిట అమాయక యువత నుండి లక్షల రూపాయలు దండుకున్నట్లు తేలిందన్నారు. కాబట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వారిపై శిక్షించేందుకు సిద్దమయినట్లు మావోయిస్టులు హెచ్చరించారు.
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆత్మీయ సమ్మేళనాలు కాదు ఆర్ఎఫ్ సిఎల్ బాధిత కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలిచి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకోవాలని మావోలు సూచించారు. ఉద్యోగాల కుంభకోణం ఎమ్మెల్యే అనుచరుల పనేనని... వారిని కాపాడుకునేందుకు అఖిలపక్షం పేరిట ఎమ్మెల్యే డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ముందు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన బ్రోకర్ల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేసారు.
Read More పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు: శేషన్నను నిర్ధోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు
ఆర్ఎఫ్ సిఎల్ బాధితుల ఆత్మహత్యలకు ఎమ్మెల్యే, అతని అనుచరులే బాధ్యత వహించాలని మావోలు అన్నారు. ఉద్యోగాల పేరిట అమాయకులను నిండా ముంచిన ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎమ్మెల్యే అనుచరులు, కార్మిక సంఘాల నాయకులు వసూలు చేసిన డబ్బుల్లో చందర్ కు వాటా వుందన్నారు.90 మంది బ్రోకర్లను 76 కు కుదించి అఖిలపక్షం పేరిట డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
కోల్ బెల్డ్ ప్రాంతంలో రౌడీ గ్యాంగులను, భూకబ్జా కోరులను దగ్గర పెట్టుకుని రామగుండం ప్రాంతాన్ని శాసించాలని చందర్ చూస్తున్నాడని అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే చందర్ తో పాటు కార్మిక సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు ప్రజాకోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు.
మావోయిస్టుల లేఖ యధావిధిగా



రాజకీయ పార్టీల నాయకులకు డబ్బులిచ్చి ఆర్ఎఫ్ సిఎల్ లో ఉద్యోగాలు రాక తిరుగుతున్నవారు మరో 150 మంది వున్నారు... ఇలాంటి బాధితులందరికీ నూటికి నూరు శాతం డబ్బులు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యే కోరుకంటిదే అని మావోయిస్టులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇచ్చిన చెక్కులు చెల్లక కొంతమంది బాధితులు ఆందోళనకు గురవుతున్నారు... వారికి కూడా న్యాయం జరిగేలా చూడాలన్నారు.
సిపిఐ మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ పేరిట అధికార పార్టీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ వెలువడిన లేఖ కలకలం రేపుతోంది. ఈ లేఖపై పోలీసులు కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఎమ్మెల్యే భద్రతపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
