ప్రైవేట్ స్కూల్లో చదువు, సెలవుల్లో అడవుల్లోకి: మావోయిస్టు రావుల రంజిత్ లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ ఇవాళ పోలీసులకు లొంగిపోయాడు. రావుల శ్రీకాంత్ అలియాస్ రామన్న కొడుకే రంజిత్. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు రంజిత్ దూరంగా ఉంటున్నాడు.
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ లొంగిపోయినట్టుగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం నాడు హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. రావుల రంజిత్ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత రామన్న, సావిత్రి దంపతుల తనయుడే రావుల రంజిత్ అని డీజీపీ చెప్పారు.
బాల్యమంతా మావోయిస్టు పార్టీల్లోనే కొనసాగిందని ఆయన చెప్పారు. మావోయిస్టు పార్టీ నడిపే స్కూల్లోనే ఆరో తరగతి వరకు రంజిత్ చదువుకొన్నాడన్నారు. రంజిత్ తండ్రి శ్రీకాంత్ అలియాస్ రామన్న పీపుల్స్ వార్ లో 1982లో చేరాడని చెప్పారు. అంచెలంచెలుగా రామన్న సెంట్రల్ కమిటీ వరకు ఎదిగాడన్నారు.
also read:మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ లొంగుబాటు
శబరి ఏరియా కమిటీ ద్వారా నిజామాబాద్ లోని కాకతీయ స్కూల్ లో రంజిత్ ను టెన్త్ వరకు తండ్రి చదివించాడని చెప్పారు. ఈ సమయంలో పార్టీ ఆర్గనైజర్ నగేష్ ను వినియోగించుకొన్నాడన్నారు. 2016లో రంజిత్ టెన్త్ క్లాస్ పూర్తైంది. అయితే ప్రతి వేసవిలో రంజిత్ అడవికి వెళ్లి తన తల్లిదండ్రులను కలుసుకొనేవాడని డీజీపీ తెలిపారు.
2016లో జరిగిని ఎన్ కౌంటర్లో పార్టీ ఆర్గనైజర్ నగేష్ మరణించడంతో రంజిత్ ను శ్రీకాంత్ అడవి నుండి బయటకు పంపలేదన్నారు. 2017లో తండ్రి శ్రీకాంత్ సూచన మేరకు రంజిత్ బెటాలియన్ లో చేరినట్టుగా చెప్పారు. మావోయిస్టు పార్టీ బెటాలియన్ కమిటీ చీఫ్ గా ఆయన కొనసాగుతున్నారు.
గుండెనొప్పితో 2019 డిసెంబర్ మాసంలో రావుల శ్రీకాంత్ మరణించాడు. దీంతో అప్పటి నుండి రంజిత్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇవాళ ఆయన లొంగిపోయినట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.