ఐటి దిగ్గజాలకూ మియాపూర్ దెబ్బ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని మియాపూర్ భూకుంభకోణం దేశ సరిహద్దులను దాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కుంభకోణం చర్యనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద భూకుంభకోణం ఇదేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ కుంభకోణం తాకిడి ఐటి దిగ్గజ కంపెనీలకు సైతం తాకింది.
హైదరాబాద్ లో కొన్నిచోట్ల భూముల రిజిస్ట్రేషన్ టైటిల్స్ సరిగాలేవని, వాటిని కొనుగోలు చేసిన ఐటి కంపెనీలు సైతం ఇబ్బందులు పడుతున్నాయంటూ ది ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఒక కథనం రాసింది. ఇబ్బందులకు గురవుతున్న ఐటి దిగ్గజ కంపెనీల జాబితాలో గూగుల్, మైక్రోసాఫ్ట్ డిఎల్ఎఫ్, ల్యాంకో, షాపూర్జీ పల్లోంజి, పురవంకర, సత్వ సలార్ పురియా వంటి సంస్థలు ఉన్నాయి.
ఆయా కంపెనీలు హైదరాబాద్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేశాయి. ఇప్పుడు మియాపూర్ భూముల కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆయా కంపెనీలు తాము కొనుగోలు చేసిన భూముల సంగతేంటన్న ఆందోళనలో పడ్డాయని ఆ పత్రిక తన కథనంలో వివరించింది. వందల ఎకరాల భూములను ఇప్పటికే ఐటి దగ్గజ సంస్థలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేశాయి. మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లు వివాదాస్పమైనందున తమ భూముల విషయం ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నాయి.
తెలంగాణ సర్కారు మాత్రం ఈ భూముల వ్యవహారం ఇప్పుడే పుట్టుకొచ్చింది కాదని, గత ప్రభుత్వాల హయాంలోనే ఈ సమస్య ఉత్పన్నమైందని చెబుతోంది. భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు సరిగా లేకపోవడానికి అనేక కారణాలున్నాయని పేర్కొంటొంది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ది ఎకనమిక్స్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. భూముల రిజిస్ట్రేషన్ లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నదని చెప్పారు.
మొత్తానికి హైదరాబాద్ లో భూముల కుంభకోణం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సర్కారు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు సిబిఐ విచారణకు డిమాండ్లు రోజు రోజుకూ మరింతగా పెరుగుతున్నాయి.