హైదరాబాద్కు మాణిక్రావ్ ఠాక్రే.. వరుస భేటీలతో బిజీ బిజీ.. టీ కాంగ్రెస్లో సమస్యలు పరిష్కారం అయ్యేనా..?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నూతనంగా నియమితులైన మాణిక్ రావ్ ఠాక్రే రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రాష్ట్రానికి విచ్చేశారు. మాణిక్ రావ్ ఠాక్రే ఆ హోదాలో రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నూతనంగా నియమితులైన మాణిక్ రావ్ ఠాక్రే రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రాష్ట్రానికి విచ్చేశారు. మాణిక్ రావ్ ఠాక్రే ఆ హోదాలో రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మాణిక్ రావ్ ఠాక్రేకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అనంతరం మాణిక్ రావ్ ఠాక్రే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా గాంధీ భవన్కు చేరుకున్నారు. తొలుత ఆయన ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై వారి నుంచి వివరాలు సేకరించనున్నారు.
ఆ తర్వాత టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో మాణిక్ రావ్ ఠాక్రే సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో సమావేశం కానున్నారు. అనంతరం టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆఫీస్ బేరర్లతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఇక, ఈ రోజు రాత్రికి మాణిక్ రావ్ ఠాక్రే హైదరాబాద్లోనే బస చేయనున్నారు.
ఇక, గురువారం ఉదయం 10.30 గంటలకు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ అవుతారు. అలాగే ఇతర సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. రేపు సాయంత్రం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
అయితే ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నూతన ఇంచార్జ్గా నియమితులైన మాణిక్ రావ్ ఠాక్రే ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఈనెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇస్తారనేది చూడాల్సి ఉంది. ఈరోజు, రేపు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్న పార్టీ నేతల మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మాణిక్ రావ్ ఠాగూర్.. ముందు అనేక సవాళ్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీనియర్లు అసమ్మతి వీడతారా..?
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీల నియమాకం చిచ్చును రాజేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు గళం వినిపించారు. ఒర్జినల్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్.. తమ దూతగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి సద్దుమణిగినట్టుగా కనిపించకలేదు.
ఇటీవల నిర్వహించిన టీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ నేతలు డమ్మా కొట్టారు. ఉత్తమ్, జగ్గారెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరుకాలేదు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్గా మాణిక్రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. అయితే మాణిక్కం ఠాగూరుపై సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త ఇంచార్జ్ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. సీనియర్లు తమ అసమ్మతిని వీడాతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.