ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ కీలక భేటీ.. మునుగోడు ఉపఎన్నిక, వెంకట్ రెడ్డి ఆడియోపై చర్చ
మునుగోడు ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో టేప్ వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది.
హైదరాబాద్ గాంధీ భవన్లో టీ.కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో మునుగోడు ఉపఎన్నికపై చర్చిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ పాదయాత్రపైనా సమాలోచనలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారంపైనా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also REad:నా అన్నపై దుష్ప్రచారం.. పాల్వాయి స్రవంతికి కేసీఆర్ డబ్బు : వెంకట్ రెడ్డి ఆడియోపై రాజగోపాల్ రెడ్డి
కాగా.. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తన పిసిసి పదవినుండి తప్పించే కుట్రలు జరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే సంచలన ఆడియో ఒకటి బయటపడింది. టిపిసిసి స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలని మునుగోడు నాయకులను కోరుతూ పోన్ కాల్ ఆడియో లీక్ అయ్యింది. మునుగోడుకు చెందని కాంగ్రెస్ లీడర్ తో వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మునుగోడులో కాంగ్రెస్ ఓడితే ఈ దెబ్బతో తాను పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని... ఏదయినా వుంటే అప్పుడు చూసుకుంటానని కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు... కాబట్టి పార్టీలను చూడకుండా ఆయనకే ఓటెయ్యాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు ఆడియో వెలుగుచూసింది.