పక్కా స్కెచ్తోనే దీక్షిత్ హత్య, ఆర్ఎంపీ వద్ద నిద్రమాత్రలు: ఎస్పీ కోటిరెడ్డి
తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కోసం మంద సాగర్ పక్కా పథకం పన్నాడని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.
మహబూబాబాద్:తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కోసం మంద సాగర్ పక్కా పథకం పన్నాడని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.
శుక్రవారం నాడు మీడియా ఎదుట నిందితుడు మందసాగర్ ను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ నెల 18వ తేదీన దీక్షిత్ రెడ్డిని మంద సాగర్ తన బైక్ పై తీసుకెళ్లాడని ఆయన చెప్పారు.దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేయడంతో ఆయన తండ్రి రంజిత్ రెడ్డి నుండి డబ్బులు వసూలు చేయాలని సాగర్ ప్లాన్ చేసినట్టుగా ఎస్పీ చెప్పారు.
20 రోజుల క్రితమే దీక్షిత్ రెడ్డికి సాగర్ రూ. 10 ఇచ్చినట్టుగా తమ దర్యాప్తులో తేలిందన్నారు. దీక్షిత్ రెడ్డిని మచ్చిక చేసుకొనేందుకు ఈ డబ్బులు ఇచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రంజిత్ రెడ్డి నగరంలో ఓ ప్లాట్ కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తించి అతడి కొడుకును కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
ఈ నెల 18వ తేదీన సాయంత్రం దీక్షిత్ ను తన బైక్ పై తీసుకెళ్లాడని ఎస్పీ చెప్పారు. పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్తున్నామని చెప్పి గుట్ట మీదకు తీసుకెళ్లాడని ఆయన చెప్పారు.గుట్ట మీదకి వెళ్లిన తర్వాత భయంగా ఉందని చెబితే నిద్రమాత్రలు కలిపిన నీళ్లు ఇచ్చాడని ఎస్పీ వివరించారు. బాలుడి మత్తులోకి దిగిన తర్వాత హత్య చేశాడని ఆయన చెప్పారు.
also read:హత్య చేసి దీక్షిత్ ఇంటికి, లవర్కి డింగ్ టాక్ యాప్తో ఫోన్లు: మంద సాగర్ రిమాండ్ రిపోర్టు
డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగులబెట్టాడన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఎస్పీ వివరించారు.
దీక్షిత్ ను కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే హత్య చేయడంతో తాము కాపాడలేకపోయామని ఎస్పీ చెప్పారు.నిందితుడిని ఇవాళ రిమాండ్ కు తరలిస్తున్నామని ఆయన చెప్పారు.
సరిగా నిద్ర పట్టడం లేదని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద మూడు నెలల క్రితం నిద్ర మాత్రలను తీసుకొన్నాడని ఎస్పీ వివరించారు. ఈ నిద్రమాత్రలను దీక్షిత్ కు ఇచ్చాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు ఎస్పీ.ఒకరిద్దరూ అమ్మాయిలను కూడ చనిపోతానని నిద్రమాత్రలను చూపి బ్లాక్ మెయిల్ చేశాడని కూడ ఆయన చెప్పారు.