గ్రామ తీర్పు:హత్య చేశాడనే అనుమానంతో కొట్టి చంపేశారు, గ్రామస్తుల అరెస్ట్
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడనే అనుమానంతో మోహన్ అనే వ్యక్తిని గ్రామస్తులంతా కలిసి స్తంభానికి కట్టేసి చితకబాదారు.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడనే అనుమానంతో మోహన్ అనే వ్యక్తిని గ్రామస్తులంతా కలిసి స్తంభానికి కట్టేసి చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపుపరం మండలం పర్వేదుల గ్రామానికి చెందిన గురుమూర్తి, మోహన్ ఇద్దరు స్నేహితులు.. కొద్దిరోజుల క్రితం గురుమూర్తి అనుమానాస్పద స్ధితిలో మరణించాడు.
అయితే గురుమూర్తిని మోహనే చంపాడని బంధువులంతా గట్టిగా నమ్మారు. నాటి నుంచి పరారీలో ఉన్న మోహన్ గురువారం గ్రామస్తులకు కనిపించడంతో ఊరంతా పోగైంది. అక్కడితే ఆగకుండా అందరూ ఒక్క మాట మీదకు వచ్చి మోహన్ను చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే మోహన్ తీవ్రంగా గాయపడటంతో అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గ్రామస్తులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.