కొత్తగూడెంలో ఓ యువకుడు ఇద్దరు యువతుల్ని ఒకేసారి వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు పెళ్లి పత్రిక ముద్రించారు. ఇప్పుడే పత్రిక వైరల్ గా మారింది.
కొత్తగూడెం : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వెడ్డింగ్ కార్డ్ వైరల్ గా మారింది. అంతగా ఈ కార్డులో ఏముంది అంటే.. ఓ వ్యక్తి ఒకే ముహూర్తంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడుతున్నాడు. దీనికి సంబంధించి వెడ్డింగ్ కార్డు కూడా ముద్రించాడు. ఈ పెళ్లి గురువారం కొత్తగూడెంజిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో జరగనుంది. ఈ శుభలేఖ బయటికి రావడంతో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. మడివి సత్తిబాబు అనే ఎర్రబోడుకు చెందిన యువకుడు.. అదే మండలంలోని దోసిల్లపల్లికి చెందిన స్వప్న కుమారి, కున్నాపల్లికి చెందిన సునీతలను వివాహం చేసుకుంటున్నాడు.
అయితే, ఇది ప్రేమ వివాహం కావడం కూడా ఇక్కడ మరో ట్విస్ట్. సత్తిబాబు.. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. కొన్నాళ్ల తర్వాత ఈ విషయం ఎలాగో బయటికి వచ్చింది. దీంతో మూడు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఆ ముగ్గురి కుటుంబ సభ్యులు ఓ దగ్గర కూర్చుని ఇంటి పెద్దలు మాట్లాడుకున్నారు. సత్తిబాబు ఇద్దరితో ప్రేమాయణం నడిపాడు కాబట్టి వారిద్దరిని అతడికే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు.
నవీన్ హత్య కేసు: 9 నెలల ప్రేమ కోసం 'ఫ్రెండ్ను చంపిన హరిహరకృష్ణ
అయితే ఈ నిర్ణయానికి రావడం వెనక మరో కారణం ఉందని కూడా తెలుస్తోంది. సత్తిబాబు గత కొద్ది కాలంగా సునీత, స్వప్నలతో సహజీవనం చేస్తున్నాడు. ఈ సహజీవనంలో భాగంగా ఈ యువతులిద్దరికీ సంతానం కూడా కలిగినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు సత్తిబాబుకి ఇద్దరితో పెళ్లి జరిపించాలని నిర్ణయించారట. అందుకే వివాహ పత్రికలో ఇద్దరి పేర్లు వేసి ముద్రించారు. గురువారం గిరిజన సంప్రదాయం పద్ధతిలో సత్తిబాబుతో ఆ ఇద్దరు యువతులకు పెళ్లి జరగనుంది.
