కరీంనగర్: ఉదృతంగా ప్రహహిస్తున్న వాగులో కొట్టుకుపోయి... ఒకరి మృతి
కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షం ఓ వ్యక్తిని బలితీసుకుంది. భారీ వర్షాలతో పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మరణించాడు.
కరీంనగర్: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే అతి భారీ వర్షాలు కురిస్తూ మనుషుల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ మండలంలోని నల్లబాయి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. చెర్లభూత్కూర్ నుండి ఐతరాజ్ పల్లి గ్రామానికి వెళ్ళే దారిని ముంచేస్తూ మరీ వరద నీరు ప్రవహిస్తోంది. ఇలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటిలోనే రోడ్డు దాటేందుకు చెర్లభూత్కూర్ ప్రశాంత్ నగర్ కి చెందిన ముతమల్ల దేవేందర్(45) ప్రయత్నించాడు. అయితే నీటి ఉదృతికి వాగులో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు.
read more బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... తెలుగురాష్ట్రాల్లో నేడు వర్షపాతం ఎలా వుండనుందంటే..?
అయితే అక్కడున్నవారు దేవేందర్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే నల్లభాయి వాగు వద్దకు చేరకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు గాలింపు చేపట్టారు. రాత్రంతా గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇవాళ నీటి ఉదృతి కాస్త తగ్గడంతో దేవేందర్ మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది.
వీడియో
మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దేవేందర్ మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.