సారాంశం

ఓ వ్యక్తికి రాత్రి భోజనం చేసిన తరువాత ఆగకుండా ఎక్కిళ్లు వచ్చాయి. దీంతో అతను గుండెపోటుతో మృతి చెందాడు. 

సంగారెడ్డి : తెలంగాణలోని  సంగారెడ్డిలో  ఓ విషాద ఘటన వెలుగు చూసింది.  సంగారెడ్డి జిల్లా కలిహేరు మండలం ఖానాపూర్ లో నర్వ సాయిలు (39) అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.  ఖానాపూర్ పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్న నర్వ సాయిలు మంగళవారం రాత్రి భోజనం చేశాడు. ఆ తర్వాత ఒకసారిగా ఎక్కిళ్లు మొదలయ్యాయి.  అయితే అవి మామూలుగా ఎప్పుడూ వచ్చే ఎక్కిళ్ళలా లేవు ఊపిరాడనివ్వలేదు.

 దీంతో నర్వ సాయిలు  తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించడం కోసం అంబులెన్స్ ను పిలిపించారు.  అంబులెన్స్ వచ్చేలోగానే సాయిలు చనిపోయాడు.  సాయిలను పరీక్షించిన 108 సిబ్బంది ఎక్కిళ్లతోనే నర్వ సాయిలు గుండెపోటుకు గురైనట్లు తెలిపారు.  అతని మరణం పై ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.