జాలిపడి అప్పులు ఇప్పిస్తే వారు కట్టకపోవడంతో.. ఒత్తిడి తట్టుకోలేక ఓ ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. 

ఖమ్మం : ‘స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరివల్ల నేను ఇబ్బందులు పడ్డాను. సాయి అమ్మను మంచిగా చూసుకో.. అమ్మ మాట విను’ అంటూ మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బింగి వెంకటేశ్వరరావు తన మృతికి కారణాలు వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు మధిర ఆర్టిసి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే, మధిరలోని కొందరు ఫైనాన్సర్లతోపాటు పలువురి వద్ద నుంచి.. మరికొందరికి ఆయన డబ్బు అప్పుగా ఇప్పించాడు.

అయితే, అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోవడంతో వెంకటేశ్వరరావుపై ఫైనాన్షియర్లు, ఇతరుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో కొంతకాలం ఆయన సొంతంగా తానే వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అత్తగారిల్లు ఏపీలోని పెనుగంచిప్రోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కందుకూరుకు వచ్చిన వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి పడిపోయాడు.

దారుణం : విడిపోయేందుకు అడ్డుగా ఉన్నాడని బిడ్డ అమ్మకానికి.. తల్లీ,తండ్రి,తాత అరెస్ట్...

ఈ విషయం పెనుగంచిప్రోలులో ఉన్న భార్యకు తెలియడంతో ఆమె రాత్రి కందుకూరుకు చేరుకుంది. ఆ తరువాత వెంకటేశ్వర రావును సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆమె.. తన భర్త కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ సురేష్ తెలిపారు. అయితే సాయంత్రానికి ఈ కేసులో ట్విస్ట్ ఏర్పడింది.

వీడియో వైరల్..
వెంకటేశ్వర రావు మృతికి అనారోగ్యమే కారణమంటూ ఆయన భార్య ఫిర్యాదు చేయగా బుధవారం సాయంత్రానికి ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో బయటికి వచ్చింది. ఇందులో పలువురి వద్ద డబ్బులు తీసుకుని, వేరే వాళ్లకు అప్పుగా ఇప్పించానని.. ఇప్పుడు వారు కట్టకపోవడంతో.. అప్పు ఇచ్చిన వారినుంచి ఒత్తిడి పెరిగిందని.. కొంతకాలంగా సొంతంగా డబ్బు కట్టాను... కానీ ఇక కట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ‘నన్ను క్షమించు స్వప్న.. పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నాను. సాయి (కొడుకు) అమ్మను మంచిగా చూసుకో’ అని చెబుతూ పురుగుల మందు తాగి పడిపోయాడు.

సాయంత్రానికి ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వెంకటేశ్వరరావు ఈ సెల్ఫీ వీడియోలో పలువురి పేర్లను ప్రస్తావించాడు. అయితే, వారు అప్పులు ఇచ్చిన వారా? లేక తీసుకున్నవారా? అనేది తెలియరావడం లేదు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.