కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో భర్తను భార్య నిలదీసింది. దాంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బయటకు వెళ్లొద్దు, వెళ్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని భార్య చెప్పడమే తప్పయింది. ఆమె మాటలతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ సంఘటన సిద్ధిపేట జిల్లాలోని రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మంద రాములు (60) కుమారుడు రాజుతో కలిసి గజ్వెల్ లో ఎరువుల దుకాణం నడుపుతున్నాడు. లాక్ డౌన్ వల్ల దుకాణం మూతపడింది. కుటుంబంతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు. 

రాములు గ్రామంలో ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ వస్తున్నాడు. మంగళవారంనాడు గజ్వెల్ కూడా వెళ్లి వచ్చాడు. దాంతో రాములు భార్య అంజమ్మ అతన్ని నిలదీసింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందున బయట తిరగవద్దని చెప్పింది. 

దాంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. భార్య తనను ప్రశ్నించడమేమిటనే బాధపడిన రాములు బుధవారం తెల్లవారు జామున ఇంటి దగ్గరలోని మామిడిచెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు.