Asianet News TeluguAsianet News Telugu

పందెం కోడి: సజ్జనార్ సార్ ఆ కోడి నాదే.. వేలాన్ని ఆపండి సార్.. మహేశ్ విజ్ఞప్తి

కరీంనగర్ ఆర్టీసీ డిపో పందెం కోడిని వేలం వేయబోతున్నట్టు వచ్చిన వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత నెల్లూరు జిల్లా కావలికి చెందిన మహేశ్ అనే వ్యక్తి ఆ కోడి తనదేనని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. కోడి తనదేనని, అది ఎవరికీ ఇవ్వవొద్దని, వేలం పాటను ఆపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కోరాడు.
 

man claims pandhem kodi chicken is belongs to him, prays rtc md sajjanar to stop auction by karimnagar rtc depot kms
Author
First Published Jan 12, 2024, 2:59 PM IST

‘సజ్జనార్ సార్.. దయచేసి ఆ వేలాన్ని ఆపండి. ఆ కోడి నాది. మీ మీద నమ్మకం ఉంది నాకు. దయచేసి ఈ వేలాన్ని ఆపండి సజ్జనార్ సార్.’ మహేశ్ అనే ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు చేసిన విజ్ఞప్తి ఇది. బస్సులో మరిచిపోయిన పందెం కోడిని రెండు రోజులు కాపాడిన తర్వాత కూడా ఎవరూ అడగడానికి రాకపోవడంతో కరీంనగర్ ఆర్టీసీ డీపీ మేనేజర్ పందెం కోడి వేలాన్ని వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి సోషల్ మీడియా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశాడు. ఆ కోడి తనదే అని చెప్పడానికి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు.

ఈ నెల 9వ తేదీన వరంగల్ నుంచి వేములవాడ మధ్య నడిచే బస్సు రాత్రి పూట వేముల వాడ నుంచి చివరి ట్రిప్‌గా కరీంనగర్‌కు చేరుకుంది. బస్సును డిపోలో పెట్టబోతుండగా బస్సులో నుంచి కోడి కూత వినిపించింది. ప్రయాణికులెవరూ లేకున్నా కోడి కూత రావడంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ ఓ పందెం కోడి ఉన్నట్టు గుర్తించారు. ఆ పందెం  కోడిని ఆర్టీసీ డిపో మేనేజర్‌కు అప్పగించి డ్రైవర్, కండక్టర్ వెళ్లిపోయారు.

ఆయన రెండు రోజులు ఆ కోడిని డిపోలోనే ఉంచారు. ఎవరైనా వచ్చి తమ కోడిని అడుగుతారేమోనని ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఆ కోడిని వేలం వేస్తామని ప్రకటించారు. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వార్త చూసిన తర్వాత ఏపీకి చెందిన మహేశ్ రియాక్ట్ అయ్యాడు. ఆ కోడి తనదే అని చెప్పాడు. 

Also Read: Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బ.. వ్యూహకర్త సునీల్ కనుగోలు దూరం.. కాంగ్రెస్ ఆలోచన ఇదేనా?

తనవైపు స్టోరీని కూడా చెప్పుకొచ్చాడు. తన సొంతూరు కావలి.. నెల్లూరు జిల్లా అని పరిచయం చేసుకన్నాడు. తన పేరు మహేశ్ అని, ఏపీకి చెందిన నివాసిగా పేర్కొన్నాడు. తాను సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మేస్త్రీ పని చేయిస్తుంటానని వివరించాడు. సోమవారం రోజున ఆంధ్రాకు వద్దామని బయల్దేరానని, నిద్ర మత్తులో కోడిని బస్సులోనే మరిచిపోయానని చెప్పాడు. ఆ తర్వాత బస్సు కోసం వెతికినా తనకు దొరకలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు వీడియోలు, వార్తలు వస్తున్నాయని పేర్కొంటూ ఆ కోడి తనదేనని వివరించాడు. ఆ కోడి ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, అది తన కోడేనని, ఎవరికి ఇవ్వవొద్దని, వేలం పాటను ఆపేయాలని కోరాడు. కోడి ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని, బస్సు టికెట్ కూడా తన వద్ద ఉన్నదని తెలిపాడు. ఆ తర్వాత సజ్జనార్ సార్ అంటూ తన విజ్ఞప్తి చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios