ప్రేమ పేరుతో మోసం చేసి యువతిని గర్భవతిని చేసి మొహం చాటేసిన వ్యక్తిని.. కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగింది.
హైదరాబాద్ : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడికి రిమాండ్ తరలించిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాప్రా గాంధీనగర్కు చెందిన గడ్డం కార్తీక్(24), అదే కాలనీకి చెందిన ఓ యువతి(21), కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో యువతి తనను వివాహం చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేస్తుండడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలవడంతో కార్తీక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈనెల 8న వివాహం చేస్తానని వారంతా ఒప్పుకున్నారు. తీరా మరుసటిరోజే ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. కార్తీక్, అతడి కుటుంబసభ్యుల ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు కాపాడారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా కార్తీక్ ను శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో వేములవాడలో ఇలాంటి ఘటనలో యువతి ప్రేమికుడి ఇంటిముందు బైఠాయించింది. రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు మోసం చేశాడని (cheating) ఓ యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన (protest) ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ చెందిన తన మేనబావ ఎదురు గట్ల రాము అదే కాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమి ప్రేమిస్తున్నానని చెప్పాడు.
రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి వాపోయింది. తన తల్లి మాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని గౌతమి ఆవేదన చెందింది. ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేష్ ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.
అయినా రాము మారకపోవడంతో బుధవారం ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తల్లి కొడుకు ఇద్దరూ వెళ్లిపోయారు అని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితులు ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, జూన్ లో తమిళనాడులో ఓ యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసును ఎస్పీ సస్పెండ్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతని కోసం మహిళా పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరుకు జాక్సన్ 2017లో పోలీసు విధుల్లో చేరాడు. అతనికి పోటీ పరీక్షల పుస్తకాలు కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి తారసపడింది.
ఆమె నెంబర్ తీసుకుని మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం అతను డీఎంకే యువజన విభాగం నేతకు గన్మెన్ గా ఉన్నాడు. ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా తనకు ఉద్యోగం పోయిందని కొంతకాలం వేచి ఉండాలని సూచించాడు.
అతడి మోసాన్ని పసిగట్టిన యువతి తిరుచెందూరు మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. రాజకీయ పలుకుబడితో జాక్సన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ఎస్పీ జయ కుమార్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పి కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అతన్ని ఆదివారం సస్పెండ్ చేశారు.
