కేసిఆర్ కు మెలిక: రైతు బంధుకు వద్దని దీదీకి విహెచ్ విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు బంధు కార్యక్రమానికి కాంగ్రెసు నేత వి హనుమంత రావు మెలిక పెట్టారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు బంధు కార్యక్రమానికి కాంగ్రెసు నేత వి హనుమంత రావు మెలిక పెట్టారు. ఈ కార్యక్రమానికి రావద్దని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
మమతా బెనర్జీకే కాకుండా డిఎంకె నేత స్టాలిన్ కు, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను వారికి లేఖలు కూడా రాస్తానని చెప్పారు. గత నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, ఈ కార్యక్రమానికి హాజరైతే అన్యాయాన్ని ఆ నేతలు కూడా బలపరిచినట్లవుతుందని ఆయన అన్నారు
ఎన్నికలకు ముందు కేసిఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత వాటిని మరిచిపోయారని విహెచ్ అన్ారు రైతుల రుణాలను మాఫీ చేయలేదని, ఫీజు రీయంబర్స్ మెంట్ చేయలేదని అన్నారు.
రాష్ట్రంలో 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏ విధమైన సాయం చేయలేదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడతో కేసిఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు.