కేసీఆర్ కు మమతా బెనర్జీ షాక్: ఫెడరల్ ఫ్రంట్ హైజాక్
తృణమూల్ కాంగ్రెసు అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు. ఆయన తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ను ఆమె హైజాక్ చేశారు.
హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెసు అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు. ఆయన తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ను ఆమె హైజాక్ చేశారు. కాంగ్రెసుతో కలిసి ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో మమతా బెనర్జీ ముందుకు వచ్చారు.
కేసిఆర్ ఫ్రంట్ లో కాంగ్రెసు కూడా ఉండకూడదనే భావనతో ఉన్నారు. మమతా బెనర్జీ ఈ నెల 31వ తేదీన ఢిల్లీ వెళ్లి బిజెపియేతర పార్టీల నాయకులను కలిసే అవకాశం ఉంది. కోల్ కతాలో ర్యాలీ ఏర్పాటు చేసి ఫెడరల్ ఫ్రంట్ ను ప్రకటిస్తారని అంటున్నారు. జనవరిలో ఈ జాతీయ స్థాయి ఫ్రంట్ ఏర్పాటుకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు.
ర్యాలీకి టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, జితేందర్ రెడ్డిల ద్వారా కేసిఆర్ కు ఆమె ఆహ్వానం పంపే అవకాశం ఉంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెసు నేతలతో వేదికను పంచుకోవడం ఇష్టం లేక కేసిఆర్ వెళ్లలేదు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించారు.
నిజానికి, మార్చి నుంచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు రాజకీయ కార్యాచరణను చేపట్టాలని కేసిఆర్ అనుకున్నారు. కానీ దానికి ముందే మమతా బెనర్జీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రంట్ కు కాంగ్రెసును దూరంగా ఉంచాలనే కేసిఆర్ ప్రతిపాదనను ఆమె ఇష్టపడడం లేదు.