బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మరాయని సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క విమర్శించారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మరాయని సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క విమర్శించారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని విమర్శించారు. మల్లు భట్టి విక్రమార్క గాంధీ భవన్లో ఈరోజు జరిగిన హాత్ సే హాత్ జోడో సమీక్ష సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని ఆ పార్టీ నేతలు బడాయిలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తాము కట్టిన కంపెనీల నుంచే విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక భద్రాద్రి, యాదాద్రి రెండు విద్యుత్ ప్లాంట్లను మాత్రమే చేపట్టిందని అన్నారు. అందులో యాదాద్రి ఇంకా ప్రొడక్షన్ ప్రారంభం కాలేదని అన్నారు. హైదరాబాద్కు నీళ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మాణం జరిగిందని అన్నారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ది కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్లో భూముల రెట్లు పెరిగాయని అన్నారు. ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ అమ్మేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ చుక్కనీరు పారలేదని అన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. 2009లో రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతండగా.. సభ మధ్యలోనే ఇక్కడ భేటీ జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తన చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అని రాజశేఖరరెడ్డి చెప్పారని తెలిపారు. ఆ దిశలో సిద్దం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు రాజశేఖరెడ్డి కూడా పిలుపిచ్చారని చెప్పారు. ఇంటింటికి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలను పాటిస్తూ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేద్దామని అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలను విజయవంతం చేయాలని కోరారు.
