నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం... మతాంతర వివాహం చేసుకోలేక, ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమకు అడ్డురాని మతం పెళ్ళికి అడ్డువస్తుందని... జీవితాంతం కలిసి బ్రతకలేమని భావించిన ప్రేమజంట కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాదం నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్ కర్నూల్: మతాలు వేరయినా వారిద్దరి మనసులు కలిసాయి. అయితే ప్రేమకు అడ్డురాని మతం పెళ్లికి అడ్డొస్తుందని వారికి తెలుసు. అలాగని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక తీవ్ర మనోవేధనకు గురయ్యారు. ఇక జీవితాంతం కలిసి బ్రతకలేమని భావించిన ప్రేమజంట కలిసి చనిపోదామన్న దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా (nagarkurnool district)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన షాలిమియా, ముంతాజ్ దంపతుల కుమారుడు హష్రు(26). నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో హష్రు మేనమామ రఫీక్ కుటుంబంతో సహా ఓ అద్దెఇంట్లో నివాసముంటున్నాడు. హష్రు కూడా పెద్దకొత్తపల్లిలో లేడిస్ కార్నర్ పేరుతో మహిళలకు సంబంధించిన వస్తువులను విక్రయించే షాప్ పెట్టుకున్నాడు. దీంతో మేనమామ కుటుంబంతో కలిసి నివాసముండేవాడు.
ఈ క్రమంలోనే ఇంటి యజమాని కూతురు గోపిక(18)తో హష్రుకు పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. చాలాకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ సాపీగా సాగింది. అయితే తమ ప్రేమను పెళ్ళిపీటల వరకు తీసుకెళ్లాలని భావించిన వీరికి మతం అడ్డువస్తుందన్న భయం పట్టుకుంది. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించని భావించిన ఈ ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకుంది.
read more వేములవాడలో దారుణం.. పిల్లల గొంతు కోసి.. తాను ఆత్మహత్య..
శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో పడివున్న వీరిని గమనించి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఇలా 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే హష్రు మృతిచెందాడు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతూ గోపిక కూడా మృతిచెందింది.
ఇలా ప్రేమజంట ఆత్మహత్య పెద్దకొత్తపల్లిలో విషాదాన్ని నింపింది. అయితే ఇప్పటివరకు ప్రేమజంట ఆత్మహత్యపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
ఏపీలో మరో ప్రేమజంట ఆత్మహత్య:
మరో తెలుగురాష్ట్రం ఏపీలో కూడా ఇటీవల ఇలాగే ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన అరవింద్(25), నాగరాణి(21)కి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొంతకాలం సాఫీగా సాగిన ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాలని భావించారు... కానీ కుటుంబసభ్యులకు తమ ప్రేమ గురించి చెప్పి ఒప్పించే ధైర్యం చేయలేదు.
కుటుంబసభ్యులు ఎక్కడ తమ ప్రేమను అంగీకరించకుండా పెళ్ళికి ఒప్పుకోరోనని భయపడిపోయిన ఈ ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు గన్న ప్రేమికులు చివరకు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు.
read more ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం.. న్యాయం జరగడం లేదంటూ..
ప్రేమజంట అరవింద్, నాగరాణి పొలంపనుల కోసం దాచిన గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన యువతీయువకుల మరణంతో మోగులూరులో విషాదాన్ని నింపింది. ప్రేమను పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేక ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనగురించి తెలిసి బాధపడనివారు లేరు.
(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)