మహిళను ఛాతీపై తన్నిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
ఓ మండలాధ్యక్షుడు మహిళపై దురుసుగా ప్రవర్తించాడు.
హైదరాబాద్: ఓ మండలాధ్యక్షుడు మహిళపై దురుసుగా ప్రవర్తించాడు. ఓ సివిల్ వివాదంలో మహిళ ఆదివారంనాడు అతన్ని చెప్పుతో కొట్టింది. దాంతో ఆగ్రహించిన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలాధ్యక్షుడు ఆమెను ఛాతీపై తన్నాడు.
దర్పల్లి మండలాధ్యక్షుడు ఇమ్మడి గోపి మహిళను తన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ ఫిర్యాదు మేరకు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పాలక తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గోపి ఆమెపై కౌంటర్ ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆస్తిని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.
మహిళకు చెందిన కుటుంబం గోపి నుంచి పది నెలల క్రితం 33 లక్షల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేసింది. ఆ ఆస్తిని ఆ కుటుంబానికి అప్పగించడానికి నిరాకరించాడు. ధరలు పెరిగినందున తనకు మరో రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తన బంధువుతో కలిసి ఆదివారంనాడు మహిళ గోపి ఇంటికి వెళ్లి ఆస్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. తీవ్రమైన వాగ్వివాదం చెలరేగింది. ఈ సమయంలో మహిళ గోపిని చెప్పుతో కొట్టినట్లు చెబుతున్నారు. దాంతో గోపీ ఆమెను తన్నాడు.