నాలుక కు జిఎస్టీ వేస్తే ఆ సమస్య ఉండదు
- చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై నోరు విప్పిన రేణుక
తెలంగాణ సిఎం కేసిఆర్ పై రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్ నోటికి జిఎస్టీ వేయాలంటూ హాట్ కామెంట్స్ చేశారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జనాలు మంగళ సూత్రాలు అమ్ముకుంటుంటే కేసిఆర్ కుటుంబానికి బంగారు తెలంగాణ కనబడుతున్నదా అని ప్రశ్నించారు. కేసిఆర్ నోటికి జిఎస్టీ వేస్తే ఆయన అబద్ధాల సంఖ్య తగ్గిపోతుందని ఎద్దేవా చేశారు.
సిఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. బంగారు తెలంగాణ రాలేదని, కేవలం ఒక్క కేసిఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయిందన్నారు. అబద్ధాలలో పోటీ పడుతున్న కేసిఆర్ కుటుంబ సభ్యుల నోటికి జీఎస్టీ వెయాలన్నారు.
నకిలీ విత్తనాలు అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. ప్రభుత్వమే నకిలీ విత్తనాలకు ఆమోద ముద్ర వేస్తే ,, ఇక బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. నకిలీ సీడ్ కంపెనీల పై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. మళ్లీ అవే కంపెనీల కు ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు.
సీఎం కేసిఆర్ ప్రజా సమస్యలను వదిలేసి అసెంబ్లీలో సొల్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాణ్యతను గాలి కొదిలారని ఆరోపించారు.