లేఅవుట్ రెగ్యులరైజేషన్ పై కీలక నిర్ణయం .. 20 లక్షల మందికి లబ్ది..
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020 (Layout Regularization Scheme 2020) దరఖాస్తుల అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ప్లాట్లలో ల్యాండ్ లేఅవుట్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
![Layout Regularisation Back On, March 31 Deadline for Paying Fee KRJ Layout Regularisation Back On, March 31 Deadline for Paying Fee KRJ](https://static-ai.asianetnews.com/images/01hkte1bft7z4yarj48fb9pp96/untitled-design--51--png_363x203xt.jpg)
2020 భూముల క్రమబద్దీకరణ (Layout Regularization Scheme 2020) దరఖాస్తుల అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ప్లాట్లలో ల్యాండ్ లేఅవుట్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు లబ్ది చేకూరుతుంది. అదేసమయంలో క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించడానికి దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు సమయం ఇచ్చింది. సోమవారం నాడు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని లక్షలాది దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020 కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2020 ఆగస్టు 31 నుండి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు కోరింది. పంచాయతీలు (10.76 లక్షల దరఖాస్తులు), మున్సిపాలిటీలు (10.54 లక్షల దరఖాస్తులు), మున్సిపల్ కార్పొరేషన్లు (4.13 లక్షలు) నుండి ఇలా మొత్తం 25.44 లక్షల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమబద్ధీకరణ రుసుముతో దాదాపు రూ.3,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని, కేవలం దరఖాస్తు ఫీజు ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.250 కోట్ల ఆదాయం సమకూరింది.
ఓపెన్ ప్లాట్లు, నాన్ లే అవుట్ కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లే అవుట్ స్థలాలకు సంబంధించి రూ.10 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అంతటితోనే ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలన్నీ ప్రభుత్వ నిర్ణయం కోసం నాలుగేండ్లుగా నిరీక్షిస్తున్నాయి. వివిధ కోర్టు కేసులతో ఈ ప్ర్రక్రియ ఆలస్యమైందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్ర్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అర్హులైన దరఖాస్తుదారులను రెగ్యులరైజ్ చేసేందుకు కోర్టులకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ తర్వాత ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారని అధికారులు తెలిపారు. అప్పటి నిబంధనల ప్రకారమే లే అవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లే-అవుట్ ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులన్నీ వారి సొంతమవుతాయి. దీంతో నిర్మాణాలు చేపట్టడం, బ్యాంకు రుణాలు పొందడం లేదా తమ భూమిని విక్రయించడం ద్వారా భూమిపై యాజమాన్య హక్కులను పొందుతారని సీఎం రేవంత్ చెప్పారు.