అత్తింటివారి దాడి: అవమానంతో హైద్రాబాద్లో అల్లుడి ఆత్మహత్య
అత్తింటివారు చేయిచేసుకొన్నారని లక్ష్మణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన హైద్రాబాద్లో చోటు చేసుకొంది.
హైద్రాబాద్ బోరబండ టి. అంజయ్యనగర్కు చెందిన లక్ష్మణ్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. తెల్లాపూర్ కు చెంందిన స్వప్నను గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన పెళ్లి చేసుకొన్నాడు.
స్వప్నకు లక్ష్మణ్ కంటే ముందే ఓ వివాహమైంది. అయితే కారణాలు ఏమిటో కానీ భర్తను వదిలేసింది. ఆ తర్వాత లక్ష్మణ్ తో స్వప్న వివాహం జరిగింది.లక్ష్మణ్ తో వివాహం జరిగిన తర్వాత కాపురానికి వచ్చిన స్వప్న నిత్యం భర్తతో గొడవకు దిగేది. కాపురానికి వచ్చిన నెల రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది.
పనికి సరిగా వెళ్లడం లేదని లక్ష్మణ్ తో ఆయన భార్య స్వప్న గొడవపడేది. నెల క్రితం స్వప్న పాపకు జన్మనిచ్చింది.గత నెల 31వ తేదీ రాత్రి 21వ రోజరు పంక్షన్ లో అత్తింటివారితో లక్ష్మణ్ కు గొడవ జరిగింది. దీంతో వారు స్థంభానికి కట్టేసి లక్ష్మణ్ ను కొట్టారు.
మరునాడు ఉదయం పారిపోయి లింగంపల్లికి వచ్చి పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే స్థానికులు అతడిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు లక్ష్మణ్ ను ఇంటికి తీసుకెళ్లారు. అత్తింట్లో తనకు జరిగిన అవమానాన్ని అతను కుటుంబసభ్యులకు చెప్పి ఏడ్చాడు.
సోదరుడికి ఫోన్ ఇచ్చి వస్తానని చెప్పి వెళ్లి లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. శనివారం ఉదయం వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. లక్ష్మణ్ ఇంటికి సమీపంలోని బంధువుల ఇంటి వద్ద దుర్వాసన రావడంతో అక్కడ వెతికితే కుళ్లినస్థితిలో లక్ష్మణ్ మృతదేహం కన్పించింది.
కుటుంబసభ్యులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్తలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మణ్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.