చివరి అంకానికి బోనాలు: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లాల్దర్వాజ బోనాలు
లాల్దర్వాజ అమ్మవారి బోనాలు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. ఆషాడ బోనాల ముగింపు కార్యక్రమం ఈ బోనాలతో పూర్తి కానుంది. ఈ బోనాలను పురస్కరించుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలను సమర్పించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆషాడం బోనాల ఉత్సవాలు చివరి అంకానికి చేరుకొన్నాయి. ఇవాళ లాల్దర్వాజ అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో సింహవాహిని అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. బోనాలు తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
భాగ్యలక్ష్మి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారి ఊరేగింపును పురస్కరించుకొని పాతబస్తీలో ట్రాఫిక్ పై పోలీసులు ఆంక్షలు విధించారు.లాల్దర్వాజ బోనాలతో హైద్రాబాద్ లో ఆషాడమాసం బోసాల సందండి ముగియనుంది. హైద్రాబాద్ లో బోనాల సందడి ముగిసిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శ్రావణ మాసంలో బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు.
బోనాల ఉత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.