మహిళా సర్పంచ్ ప్రాణం తీసిన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్.. !!
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఓ మహిళా సర్పంచ్ ప్రాణాలు తీసింది. ఆపరేసన్ చేస్తుండగా ఫిట్స్ రావడంతో ఆపరేషన్ టేబుల్ మీదే మహిళా సర్పంచ్ మృతి చెందింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఓ మహిళా సర్పంచ్ ప్రాణాలు తీసింది. ఆపరేసన్ చేస్తుండగా ఫిట్స్ రావడంతో ఆపరేషన్ టేబుల్ మీదే మహిళా సర్పంచ్ మృతి చెందింది.
నారాయణపేట జిల్లా దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దామరగిద్ద పీహెచ్సీలో డీపీఎల్ సర్జన్ డాక్టర్ హరిచందర్ రెడ్డి సమక్షంలో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్ చేపట్టారు
ఈ శిబిరంలో ఆపరేషన్ చేయించుకునేందుకు లింగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మి (32) వచ్చింది. ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆమెను మధ్యాహ్నం రెండు గంటలకు ఆపరేషన్ థియేటర్ కు తరలించారు
జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చి, గర్భసంచి ప్రాంతంలో కడుపుపై ట్రాక్టర్ ను లోపలకి పంపేందుకు చర్మాన్ని కట్ చేసే సమయంలో లక్ష్మికి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే లక్ష్మీ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు నారాయణపేట పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళా సర్పంచ్ మృతి చెందిందని బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
లక్ష్మి కి సర్జరీ చేసేందుకు అనస్తీషియా వైద్యులు జైలోకిన్ ఇంజక్షన్ ఇచ్చారని, ఆపరేషన్ చేసేందుకు హరిచందర్ రెడ్డి చర్మాన్ని కట్ చేయగా.. పేషంట్ కోమాలోకి వెళ్ళిందని డీఎంహెచ్వో జయ చంద్రమోహన్ తెలిపారు.
దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే, అక్కడికి చేరుకోగానే ఆమె మృతి చెందినట్లు చెప్పారు, లక్ష్మి మృత్తికి గల కారణం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు.