నష్టమేమీ లేదు: దానంపై కుంతియా స్పందన
మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామాపై చేయడంపై కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా స్పందించారు.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామాపై చేయడంపై కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా స్పందించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా నష్టం లేదని అన్నారు.
వార్ రూమ్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నేతలు పార్టీని వీడుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా ఓట్ల శాతం తగ్గలేదని ఆయన గుర్తు చేశారు.
కొత్తగా ఎన్నికైన ముగ్గురు కార్యదర్శులకు విశేషాధికారాలుంటాయని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందనే నాగేందర్ విమర్శలను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.
వార్ రూమ్ సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వార్ రూంలో చర్చలు జరిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలని రాహుల్ గాంధీ నాయకులకు చెప్పారు.