హైద్రాబాద్ బొటానికల్ గార్డెన్ వద్ద పింకి అనే మహిళ హత్య: నలుగురికి జీవిత ఖైదు
హైద్రాబాద్ బొటానికల్ గార్డెన్ వద్ద పింకి అనే మహిళను హత్య చేసిన కేసులో నలుగురికి కూకట్ పల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.
![Kukatpally court life sentence to four Accused in Pinky murder case lns Kukatpally court life sentence to four Accused in Pinky murder case lns](https://static-ai.asianetnews.com/images/01hh9q1q1y7k5s7sek9bkp35hy/Court-case-1-1702206954558_363x203xt.jpg)
హైదరాబాద్: నగరంలోని బొటానికల్ గార్డెన్ వద్ద పింకి అనే మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కూకట్ పల్లి కోర్టు శుక్రవారం నాడు తీర్పును వెల్లడించింది. హత్యకు గురైన పింకి గర్భవతి. మృతురాలిని అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహన్ని ఏడు ముక్కలు చేసి గోనేసంచిలో బొటానికల్ గార్డెన్ వద్ద వేశారు.మృతురాలు బీహర్ కు చెందిన యువతి.
2018 జనవరి 29వ తేదీన హైద్రాబాద్ కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో ఏడు మాసాల గర్బిణి పింకి హత్యకు గురైంది. బీహార్ లోని బంకా జిల్లా మోహునా మాల్తీకి చెందిన బింగీ అలియాస్ పింకీ హత్యకు గురైంది. పింకి హత్య కేసులో మమతా ఝా, వికాస్ కశ్యప్, ఆమె కొడుకు అమర్ కాంత్ ఝా పై గచ్చిబౌలి పోలీసులు పీడీ కేసు నమోదు చేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందనే కారణంగా పింకి భర్త వికాస్ హత్య చేశాడు. పింకి దినేష్ అనే వ్యక్తికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2017లో భర్తను పింకి వదిలి పెట్టింది. వికాస్ అనే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది. అయితే వికాస్ కు అంతకు ముందే మమత ఝా అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
మమత ఝా , ఆమె భర్త అనిల్ ఝా, వారి కొడుకు అమర్ కాంత్ ఝా ఉపాధి కోసం హైద్రాబాద్ వచ్చారు. అయితే అదే సమయంలో ప్రియుడి కోసం పింకి కూడ హైద్రాబాద్ వచ్చింది. అమర్ కాంత్ కుటుంబంతో వికాస్ ఉంటున్నాడు.వికాస్ కు మమతతో వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని హైద్రాబాద్ కు వచ్చిన పింకి గ్రహించింది. ఈ విషయమై పింకి వికాస్ ను నిలదీసింది. దీంతో పింకిపై 2018 జనవరి 29వ తేదీ రాత్రి దాడి చేశారు.ఈ దాడిలో పింకి కడుపులోని చిన్నారితో సహా ఆమె మరణించింది. దీంతో పింకి మృతదేహన్ని స్టోన్ కట్టర్ తో ముక్కలు చేసి గోనెసంచిలో వేసి బొటానికల్ గార్డెన్ వద్ద వేశారు.