చేనేతకు చేయూత : యాదాద్రి జిల్లా పోచంపల్లిలో కేటీఆర్ పర్యటన.. (వీడియో)
యాదాద్రి జిల్లా పోచంపల్లిలో కేటీఆర్ పర్యటించారు. యువ చేనేత కళాకారుడు సైని భగత్ ఏర్పాటుచేసిన కళా పునర్వి చేనేత యూనిట్ ని కేటీఆర్ ప్రారంభించారు.
పోచంపల్లి : శనివారం నాడు యాదాద్రి జిల్లా పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు సైని భగత్ ఏర్పాటుచేసిన కళా పునర్వి చేనేత యూనిట్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
చేనేతలను కాపాడడంతోపాటు, నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ ని ఏర్పాటు చేసిన భగత్ బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
ఒకవైపు ప్రధానమంత్రి నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అన్నింటిని అమ్మి చేనేతలను ఇబ్బంది పాలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు.
పోచంపల్లి చేనేత పార్క్ ని పునరుద్ధరించి, ఇక్కడి నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
తమిళనాడులోని తిరుపూర్ టెక్స్టైల్ క్లస్టర్ మాదిరి పోచంపల్లి నేతన్నలు కలిసి పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని కేటీఆర్ సూచించారు.