జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: కొత్త కార్పోరేటర్లతో రేపు కేటీఆర్ భేటీ
ఈ నెల 11వ తేదీన ఉదయం 8:30 గంటలకు తెలంగాణ భవన్ లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.
హైదరాబాద్: ఈ నెల 11వ తేదీన ఉదయం 8:30 గంటలకు తెలంగాణ భవన్ లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం నాడు జరగనుంది.ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఈ నెల 11న ఉదయం పదకొండున్నర గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్పోరేటర్లతో ప్రమాణం చేసిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు.
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్ధుల పేర్లను సీల్డ్ కవర్లో టీఆర్ఎస్ పంపనుంది. మైనారిటీకి డిప్యూటీ మేయర్ పోస్టును ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో కూడ మైనార్టీకి చెందిన ఫసియుద్దీన్ కు టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టింది.కొత్తగా ఎంపికైన కార్పోరేటర్లకు కేటీఆర్ రేపు ఉదయం టీఆర్ఎస్ భవన్ లో దిశా నిర్ధేశం చేయనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. అయితే టీఆర్ఎస్ మాత్రం అత్యధిక స్థానాలు గెలుచుకొంది. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకొంది.