అందుకే యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు: కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే టీఆర్ఎస్ తరఫున కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి.. లు హాజరయ్యారు. అనంతర కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యంగం కాకుండా మోదీ చెప్పినట్టుగా దేశం మొత్తం నడవలాంటే ఎక్కడో ఒక్కచోట తిరుగుబాటు వస్తుందన్నారు. బహుశా తెలంగాణ నుంచే ఆ తిరుగుబాటు వస్తుందేమో తమకు తెలియదని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని చెప్పిన అనేక అంశాలను అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణకు 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేమి లేదని మండిపడ్డారు.
రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని కేటీఆర్ వెల్లడించారు. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రావాలని ఆహ్వానించాం. హైదరాబాద్లో తమ ఎంపీలు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు తెలుపుతామని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో వారికి మెజార్టీ లేకపోయినా ఆయా ప్రభుత్వాలను తలకిందులు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకొని విపక్షాల మీద వేటకుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని ప్రధాని మోదీపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి వ్యతిరేకంగా, అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్ సిన్హా గెలువాలని, రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
అదే సమయంలో ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వ్యక్తిగతంగా తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు మద్దతిస్తున్నామని బీజేపీ పదేపదే చెబుతుందని.. మరి గిరిజనులు, దళితుల కోసం ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. గిరిజిన జనాభా పెరిగిందని.. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. నాలుగేళ్లు గడిచిన కేంద్ర ప్రభుత్వం దానిని ఆమోదించలేదని.. ఇదేనా బీజేపీకి గిరిజనులపైనా ప్రేమ అని ప్రశ్నించారు.
బీజేపీ వ్యవహారం దేశంలోని గిరిజనులకు, తెలంగాణలోని గిరిజనులకు బాగా తెలుసని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, గిరిజన్లకు రిజర్వేషన్లను పెంచాలని, ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి వెనక్కి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.