భోలక్పూర్లో ఎంఐఎం కార్పొరేటర్ పోలీసుల విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్న ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.
ముషీరాబాద్ భోలక్పూర్లో (Bholakpur) ఎంఐఎం కార్పొరేటర్ పోలీసుల విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్న ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అధికారులను అడ్డుకన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి మూర్ఖపు చర్యలను సహించకూడదని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..
భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ (Mohammed Ghouseuddin).. అర్ధరాత్రి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత సైతం తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయిస్తున్న పోలీసులను గౌసుద్దీన్ అడ్డుకున్నారు. వారి విధులను అడ్డుకున్నారు. రంజాన్ మాసంలో తెల్లవార్లు హోటళ్లు తెరిచి ఉంటాయని, నిర్వాహకులను ఇబ్బంది పెట్టవద్దని ఆవేశంతో పోలీసులను హెచ్చరించారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని కానిస్టేబుల్ చెప్పగా.. నువ్వు వంద రూపాయల మనిషివి హేళన చేశారు.
పోలీసులు తమాషాలు చేస్తున్నారని అనడమే కాకుండా.. వారిని హెచ్చరించారు. తన ఏరియాలో నిబంధనలు వర్తించవని చెప్పారు. నెల రోజుల కనిపించొద్దని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక, కార్పొరేటర్ వ్యవహార శైలికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ఓ నెటిజన్.. మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీ అకౌంట్స్ను ట్యాగ్ చేశారు. పోలీసులకు గౌరవం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి నిరక్షరాస్యుల ప్రవర్తనను సహించకూడదని అన్నారు. ఆ ట్వీటపై స్పందించిన కేటీఆర్.. తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.
