గబ్బర్ సింగ్ అయితరా, కేసీఆర్ వెంట్రుక పీకలేరు: కేటీఆర్ నిప్పులు
కాంగ్రెసు నేతలపై తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు కేటీ రామారావు నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: కాంగ్రెసు నేతలపై తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు కేటీ రామారావు నిప్పులు చెరిగారు. గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్ అయితరా అని ఆయన అడిగారు. గడ్డం పెంచుకున్నవాళ్లు, గడీలను బద్దలు కొడుతామన్న వాళ్లు కేసిఆర్ వెంట్రుక కూడా పీక లేరని ఆయన అన్నారు.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ను, టీపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మంగళవారంనాడు ఆ విధంగా అన్నారు. కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు. ప్రగతి భవన్ గేట్లు తెరవరని అంటున్నారని, ప్రగతిని అడ్డుకునేవాళ్లకు ప్రగతిభవన్ తో పనేమిటని అన్నారు.
అభిపృద్ధిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఆయన అన్నారు. తమను తిడితేనే కాంగ్రెసు నాయకులకు పూట గడుస్తుందని వ్యాఖ్యానించారు. గడ్డాలు పెంచుకుంటామన్నవాళ్లకు, గడీలు పగులకొడుతామన్నవాళ్లకు ప్రజల మద్దతు లేదని ఆయన అన్నారు.
కార్మికులకు, కన్నీటితో బాధవడేవారికి, సింగరేణి కార్మికులకు, అంగన్ వాడీలకు ప్రగతిభవన్ లో చోటు ఉందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందుందని అన్నారు.
కాంగ్రెసు నాయకులు తమ పిల్లలను కూడా వదలడం లేదని, సిఎం కేసిఆర్ ను, తమ ఇంట్లో చిన్నపిల్లలను కూడా తిడుతున్నారని ఆయన అన్నారు.