పదవి రాగానే ఎగిరెగిరి పడుతున్నారు, కుప్పిగంతులే: రేవంత్ రెడ్డిపై కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొంత మంది ఎగిరెగిరి పడుతున్నారని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొంత మంది ఎగిరెగిరి పడుతున్నారని, అవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు కుప్పిగంతులేనని ఆయన అన్నారు.
బిజెపి, కాంగ్రెసు పార్టీలకు దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, ఆ పార్టీలకు తెలంగాణ ప్రాధాన్యం కాదని ఆయన అన్నారు. తమ పార్టీకి మాత్రం మొదటి, చివరి ప్రాధాన్యం కూడా తెలంగాణేనని కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలపై పోరాటం చేయగలిగేది టీఆర్ఎస్ మాత్రమేనని ఆయన అన్నారు.
కృష్ణా జలాలపై బిజెపి, కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ నాయకులు మరో రకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, తెలంగాణను టీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతుందని ఆయన అన్నారు.
టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేసిన ఎల్. రమణ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారని, నేడు మంచి రోజు కాబట్టి ఆయన లాంఛనంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని, టీఆర్ఎస్ మీదా, కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకమే తమ పార్టీలోకి నాయకులు రావడానికి కారణమని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు అండగా ఉండాలని ఆయన అన్నారు. హైదరాబాదు శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.