కేఆర్ఎంబీ సమావేశం వాయిదా... సెప్టెంబర్ ఒకటికి మార్పు
ఈ నెల 27 జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్ 1న ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సమాచారం అందించారు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం.. ఈ నెల 27 జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సమాచారం అందించారు. వాయిదా వేసిన ఈ సమావేశాన్ని వచ్చే నెల 1న జరపనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుండి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు జూలై 16న కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుండి అమల్లోకి రానుందని కేంద్రం స్పష్టం చేసింది.
Also Read:ఏపీ, తెలంగాణ జలజగడానికి చెక్, గెజిట్ విడుదల: ప్రాజెక్టులపై పెత్తనమంతా బోర్డులదే
ఒక్కో రాష్ట్రం బోర్డుల నిర్వహణ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని కేంద్రం ఆదేశించింది.రెండు మాసాల్లో ఈ నిధులను జమ చేయాలని కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులన్నీ ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తైనా వాటిని నిలిపివేయాలి. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరి పై 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది.