50 శాతం నీటి వాటా ఇవ్వాల్సిందేనన్న తెలంగాణ: ప్రారంభమైన కేఆర్ఎంబీ భేటీ
హైద్రాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ వాటర్ ఈయర్ లో 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని ఆయన కోరారు.
హైదరాబాద్: 2021-22 వాటర్ ఈయర్ లో తెలంగాణకు కృఫ్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ డిమాండ్ చేశారు.కేఆర్ఎంబీ సమావేశం బుధవారం నాడు హైద్రాబాద్ జలసౌధలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరయ్యే ముందు హైద్రాబాద్ జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ఉద్యమం నీళ్లు, నియామాకాలు, నిధులు అనే డిమాండ్తో వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉందని ఆయన గుర్తుచేశారు. కృష్ణా బేసిన్ పరిధి కాకుండా ఇతర బేసిన్లకు ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తుందన్నారు.ఈ విషయమై తమ ప్రభుత్వం తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని రజత్ కుమార్ గుర్తు చేశారు.
2014 పునర్విభజన చట్టం మేరకు కేఆర్ఎంబీని తరలించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తమ అభ్యంతరాన్ని ఏపీ ప్రభుత్వం లెక్క చేయడం లేదన్నారు. ఈ విషయమై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు.
టెలిమెట్రీల విషయంలో కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖల విషయంలో కేఆర్ఎంబీ తమను వివరణ అడగడం సరైంది కాదని రజత్ కుమార్ చెప్పారు.