ముగిసిన కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ భేటీ... రెండు బోర్డులకు సహకరిస్తాం: రజత్ కుమార్
ఏపీ ప్రభుత్వం అనవసరంగా తెలంగాణ ప్రాజెక్ట్లపై ఫిర్యాదు చేస్తోందని రాష్ట్ర నీటి పారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఆరోపించారు. రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమని కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ చైర్మన్లకు స్టేటస్ కో వుందని రజత్ కుమార్ వెల్లడించారు.
కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ.. తాము కేఆర్ఎంబీ మీటింగ్ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు. గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్ట్లకు సంబంధించిన డీపీఆర్లు ఇచ్చామని రజత్ కుమార్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనవసరంగా తెలంగాణ ప్రాజెక్ట్లపై ఫిర్యాదు చేస్తోందని ఆయన ఆరోపించారు. రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని రజత్ కుమార్ చెప్పారు. తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమని కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ చైర్మన్లకు స్టేటస్ కో వుందని ఆయన వెల్లడించారు.
అనంతరం ఏపీ ఈఎన్సీ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ల పరిధిని అక్టోబర్ 14 నుంచి అమలు చేయాలని ఆయన కోరారు. 50:50 శాతం వాటా కావాలని తెలంగాణ కోరిందని శ్యామలరావు వెల్లడించారు. పాత ఆర్డర్ ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పామన్నారు. ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం కొనసాగించాలని కోరామని శ్యామలరావు తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రిజర్వాయర్లో సర్ప్లస్ వాటర్ వుండాలని ఆయన అన్నారు. సాగు, తాగు, ఇరిగేషన్ కోసమే నీటి వినియోగం చేయాలని శ్యామలరావు చెప్పారు. అలాగే తక్షణం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరామన్నారు. క్యారీ ఓవర్ స్టోరేజ్ ప్రత్యేక అకౌంట్ పెట్టాలని తెలంగాణ డిమాండ్ చేసిందని శ్యామలరావు చెప్పారు. కానీ ప్రాక్టీకల్గా ఇది సాధ్యం కాదని కేఆర్ఎంబీకి ఏపీ తెలిపిందన్నారు. అయితే క్యారీ ఓవర్ స్టోరేజ్ని బోర్డ్ ఒప్పుకోలేదని శ్యామలరావు వెల్లడించారు.
ALso Read:కుదరని ఏకాభిప్రాయం.. కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్
అంతకుముందు కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం కొనసాగింది. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ స్పష్టం చేశారు. జలవిద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీ ఛైర్మన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.