టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి
మాజీ స్పీకర్ కే.ఆర్ సురేష్ రెడ్డి బుధవారం నాడు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు
హైదరాబాద్: మాజీ స్పీకర్ కే.ఆర్ సురేష్ రెడ్డి బుధవారం నాడు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ నెల 7వ తేదీన సురేష్ రెడ్డితో మంత్రి కేటీఆర్ సమావేశమై టీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారు.ఈ ఆహ్వానం మేరకు ఆయన టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో బుధవారం నాడు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు వీలుగా సురేష్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారు.
ఇప్పటికే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. డీఎస్ తో పాటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి లాంటి నేతలు కొందరు పార్టీని వీడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ తరుణంలోనే సురేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారు.
తన అనుచరులతో కలిసి సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. సురేష్ రెడ్డి హోదాకు దగ్గ పదవిని కట్టబెడుతామని టీఆర్ఎస్ నాయకత్వం సురేష్ రెడ్డికి హామీ ఇచ్చింది.సురేష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు నేరేళ్ల ఆంజనేయులు, బండారి రాజిరెడ్డిలు కూడ టీఆర్ఎస్ లో చేరారు.