గాంధీభవన్కొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డితో భేటీ, ఆసక్తికర చర్చ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్కు వచ్చారు. అంతేకాదు.. గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కనని తాను అనలేదన్నారు. కొత్త ఇన్ఛార్జ్ ఆహ్వానించడంతో వచ్చానని ఆయన తెలిపారు. గాంధీ భవన్తో తనకు 30 ఏళ్ల అనుబంధం వుందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలి అనే అంశంపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే.. ఎఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్లబుట్టలో పడ్డాయని కొద్దిరోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.షోకాజ్ నోటీస్ అనేది లేనే లేదన్నారు . గాంధీభవన్ కు ఇతర నేతలు కూడా రాలేదని ఆయ న చెప్పారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.నాలుగైదు సార్లు ఓటమిపాలైనవారితో తాను కూర్చోవాలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందున ప్రజల్లోకి వెళ్లి యుద్ధం చేయాలన్నారు.ఈ విషయమై ఠాక్రే కొన్ని సలహాలు చెప్పారన్నారు. తాను కూడా కొన్ని అంశాలను మాణిక్ రావుకు చెప్పినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన గురించి ఠాక్రేకు తెలుసునన్నారు.
ఠాక్రే గురించి కూడా తనకు తెలుసుని చెప్పారు.మాణిక్ రావు ఠాక్రే మంచి వ్యక్తి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మొన్న రాత్రి ఠాక్రే తనకు ఫోన్ చేశారని వెంకట్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గతంలో పార్టీ సీనియర్లను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ఈ విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారన్నారు.
ALso REad: షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయి: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
2022 నవంబర్ 4వ తేదీన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసు జారీ చేసింది. అంతకు ముందు 10 రోజుల ముందు కూడ షోకాజ్ నోటీసు ఇచ్చింది. మొదటి సారి ఇచ్చిన షోకాజ్ నోటీసు అందలేదని వెంకట్ రెడ్డికి చెందిన కార్యాలయం సమాచారం ఇవ్వడంతో మరోసారి ఆయనకు నవంబర్ 4వ తేదీన నోటీసును అందించింది. ఈ నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం పంపారు.
మునుగోడు ఉప ఎన్నికల సమంలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఫోన్ చేసినట్టుగా ఉన్న ఆడియో వైరల్ గా మారింది. మరోవైపు అస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియో వైరల్ గా మారింది. ఈ పరిణామాలపై అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఎఐసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు.దీంతో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.